ఎగ్జిబిటర్ల వెనుక 'ఆ నలుగురు'.. చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు: నట్టి కుమార్ సంచలన ఆరోపణలు

  • పర్సంటేజీ విధానం అమలు డిమాండ్ చేస్తున్న ఎగ్జిబిటర్లపై నట్టి కుమార్ ఆగ్రహం
  • చిరంజీవి కుటుంబం సినిమాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్న నట్టి కుమార్
  • చాలా థియేటర్లు సునీల్ నారంగ్, దిల్ రాజు, శిరీష్‌ల చేతిలో ఉన్నాయని వెల్లడి
  • సబ్ కమిటీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలన్న నట్టి కుమార్
సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ఎగ్జిబిటర్లపై ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిబిటర్ల వెనుక 'ఆ నలుగురు' ఉండి ఆడిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది కావాలని చిరంజీవి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, కానీ ఇది సరైన విధానం కాదని అన్నారు. రేపు మీ సినిమాలు కూడా విడుదలైనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని హెచ్చరించారు.

చాలా థియేటర్లు సునీల్ నారంగ్, దిల్ రాజు, శిరీష్‌ల లీజులోనే ఉన్నాయని గుర్తు చేశారు. నిర్మాతలు లీజ్ యజమానులకు డబ్బులు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. సునీల్ నారంగ్‌కు మహేశ్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలు భాగస్వాములుగా ఉన్నారని, కాబట్టి వారూ ఎగ్జిబిటర్ల వివాదంపై స్పందించాలని డిమాండ్ చేశారు. 'పెద్ది' చిత్రం విడుదలను ఆపాలనుకుంటే ఊరుకునేది లేదని అన్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రతి వ్యవస్థ బాగుండాలని ఆకాంక్షించారు.

ఎగ్జిబిటర్ల డిమాండ్ విషయంలో మంగళవారం రాత్రి వరకు వేచి చూస్తామని, లేదంటే బుధవారం నుంచి తానే తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. పర్సంటేజీ విధానం విషయంలో సబ్ కమిటీలోని 21 మంది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక టిక్కెట్ రేట్లు పెంచడం లేదా పెంచకపోవడం ప్రభుత్వం చేతుల్లో ఉంటుందని తెలిపారు.

Natti Kumar
Chiranjeevi
Sunil Narang
Dil Raju
Telugu Film Chamber
Exhibitors issue
Percentage system

More Telugu News